Jump to section

ఆరవ పాఠముక్రీస్తే దేవుడు

హెబ్రీ. 1:8—తన కుమారుని గూర్చియైతేదేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమైనది.’’

బైబిల్‌ను మరియు దేవుణ్ణి అర్థముచేసుకొనుటకు గల తాళపుచెవి యేసుక్రీస్తు అనే వ్యక్తి…. అనేకమంది చరిత్రకారులు ఆయనను ఒక గొప్ప నాయకునిగా పరిగణించిరి మరియు అనేకమంది సంఘ సంస్కర్తలు ఆయనను మానవాళికి ఒక గొప్ప బోధకునిగా పరిగణించిరి. నెపోలియన్ తననుతాను అలెగ్జాండర్, జూలియస్ సీజర్, మరియు చార్లెమాగ్నె అనువారితో సమానునిగా ఎంచుకొనెను, అయితే యేసు వీరందరికి పైగా ఉన్నవాడని, వేరే తరగతికి చెందిన వాడని అతడు గుర్తించెను. మార్క్స్ సిద్ధాంతాలను నమ్మేవాడు ఆయనను దేవుడు కాదనేవారు, ఇంగెల్స్ కూడా యేసు అనేవాడు లేడని చెప్పేవారు, అయితే తరువాత మార్క్స్ సిద్ధాంతాలను నమ్మేవారు ఒప్పుకొనినదేమనగా, ‘‘ఐరోపా చరిత్ర నుండి మరియు సంస్కృతి నుండి యేసు లేకుండా తుడిచివేయాలని చేయు ప్రయత్నములన్నియు నిష్పలమైనవి మరియు హాస్యాస్పదమైనవి’’ మరియు యేసు “అత్యంత పవిత్రమైన మానవ విలువలకు మంచి మాదిరి అయ్యున్నాడు.”

క్రీస్తు స్వంత ధృవీకరణలు

నిర్గమకాండము మనకు దేవుని నామము నేనే అని చెప్పుచున్నది (3:14). “అబ్రాహాము కంటే ముందు ఉన్నవాడను నేనే” అని యేసు చెప్పినప్పుడు, యూదులు ఆయన మీద విసరుటకు రాళ్ళు పట్టుకొనిరి. ఎందుకనగా, ఆయన దేవుడై ఉన్నాడని చెప్పుచున్నట్లు వారికి తెలియును. గొప్ప నేనుగా యేసు నిత్యుడు, నిత్యము – ఉనికిలో ఉన్న దేవుడు.

క్రీస్తు చేసిన అద్భుతములు ఆయన దేవుడని నిరూపించుచున్నవి

క్రీస్తు దైవత్వమునకు మరొక రుజువు భూమి మీద ఆయన చేసిన అద్భుతములు. ఆయన కాలములో ఉన్న యూదా మత బోధకుడు, నీకొదేము, దేవుడతనితో ఉంటేనేగాని ఆయన చేసిన అద్భుతములను ఎవరును చేయజాలరని ఒప్పుకొనెను (యోహా. 3:2). ఆయన మూడున్నర సంవత్సరముల పరిచర్య కాలములో ఆయన కుష్టురోగులను స్వస్థపరచెను (లూకా 5:12-13), కుంటివారిని (మత్తయి 11:5), మూగవారిని (మార్కు 7:37), గ్రుడ్డివారిని (మత్తయి 9:27-30) బాగుచేసెను మరియు మృతులను కూడ లేపెను (యోహాను 11:43-44). ఆయన దయ్యములను వెళ్ళగొట్టెను (మత్తయి 8:28-32) మరియు తుఫానును గద్దించెను (మత్తయి 8: 23-27). ఐదు రొట్టెలు మరియు రెండు చేపలను ఐదువేల మందికి పెట్టెను (మత్తయి 14:15-21). ఆయన నీళ్ళను ద్రాక్షారసముగా మార్చెను (యోహాను 2:1-11) మరియు సముద్రము మీద నడచెను (మత్తయి 14:25). ఆయనకు ప్రకృతి మీద మరియు దయ్యముల మీద అధికారము కలదు. దేవుని రాజ్యమును తెచ్చుటకు ఆయన ఈ శక్తిని మరియు అధికారమును సాధకము చేసెను, మరియు ఈ శక్తిని అధికారమును తన శిష్యులకు కూడా ఇచ్చెను. పాత నిబంధనలోని కొంతమంది ప్రవక్తలు అద్భుతములు చేయగలిగిరి, అయితే ఎవ్వరును యేసు చేసినట్లు చేయలేదు. యేసు మృతులను సజీవులనుగా లేపగలిగెను ఎందుకనగా, ఆయన దేవుడు మరియు ఆయన జీవపు శక్తిని కల్గియున్నాడు. ఆయన నేనే పునరుత్ధానమును, జీవమును అని చెప్పెను (యోహాను 11:25). ఆయన తననుతాను ప్రకృతి మీదను మరియు సాతాను మీదను ప్రభువుగా నిరూపించుకొనెను. యోహాను సువార్త చెప్పుచున్నదేమనగా, ఈ అద్భుతములు ఆయన మహిమను బయల్పరచుచున్నవి (యోహాను 2:11) మరియు ఆయన దేవుని కుమారుడని నిరూపించుచున్నవి (యోహాను 20:30-31)

క్రీస్తు మాటలు ఆయన దేవుడని సాక్ష్యమిచ్చుచున్నవి

ఆయన అధికారముతోను, జీవముతోను మాట్లాడెను (మత్తయి 7:28-29; యోహాను 6:63). అనేకమంది గొప్ప ప్రపంచ నాయకులు రాబోవు తరాలకు జ్ఞాన వాక్కులను చెప్పిరి, అయితే చరిత్రలో ఎవ్వరూ కూడా క్రీస్తు తన మాటలతో ప్రభావితము చేసినంతగా చేయలేదు.

గాంధీ నేనే లోకమునకు వెలుగు అని చెప్పలేకపోయాడు, అరిస్టాటిల్ నేనే మార్గమును, సత్యమును, మరియు జీవమును అని చెప్పలేదు. లోకము యొక్క గొప్ప తత్వవేత్తలు చెప్పగల్గినది ఏమిటంటే ఇతరులను మార్గము వైపునకు చూపించారు; వారే మార్గమని వారు చెప్పలేదు. అయితే క్రీస్తు నేనే మార్గము మరియు సత్యము మరియు జీవము అని చెప్పెను. ఒక ఫ్రెంచ్ తత్వవేత్త ఒకసారి ఇలా చెప్పెను “సువార్తల యొక్క గ్రంథస్థము తప్పుడుగా వ్రాస్తే, అది వ్రాసినవాడే  క్రీస్తు అగుటకు అర్హుడు.”

క్రీస్తు మరణమే ఆయన దేవుడని నిరూపించుచున్నది

ఆయన తన శిష్యులకు తన మరణము గురించి అది జరగక ముందే చెప్పెను (మత్తయి 16:21). ఆయన మరణము వందల సంవత్సరముల ముందే ప్రవక్తల చేత ముందుగానే చెప్పబడిన మెస్సీయా గురించిన ప్రవచనముల యొక్క నెరవేర్పు అయ్యున్నది (కీర్త. 22:15-18). పాత నిబంధనలో, కీర్తన 22:16-18 క్రీస్తు మరణము యొద్దనున్న దృశ్యమును వివరించును: “కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి యున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా యెముకలన్నియు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.” ఇది మెస్సియా చనిపోవాల్సిన మార్గమును గూర్చిన వివిధములైన వివరణ అయ్యున్నది. సువార్తలలో వ్రాయబడినది మనము చదివినయెడల, ఖచ్చితముగా ఈ మార్గములోనే క్రీస్తు చనిపోయెనని చూస్తాము. క్రీస్తు సిలువ మీద వ్రేలాడుచున్నప్పుడు, ఆయన చేతులు మరియు కాళ్ళు గుచ్చబడినవి. రక్తము నీళ్ళు అధికముగా స్రవించుట వలన ఆయన నాలుక గవదలకు అతుక్కుని ఉంటుంది, మరియు అతని ఎముకలు బయటకు వచ్చినవి. మత్తయి 27:35 చెప్పుచున్నదేమనగా, సైనికులు క్రీస్తును సిలువ వేసినప్పుడు, “చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి,” ఇది పాత నిబంధన ప్రవచనము యొక్క అక్షరానుసారమైన నెరవేర్పు.

క్రీస్తు మరణించిన సమయము మరియు మార్గము పాత నిబంధన యొక్క సాదృశ్యములలో వందల సంవత్సరముల ముందే సూచించబడినవి (నిర్గ. 12:3, 5-6). క్రీస్తు మరణించినప్పుడు ఆయన ఇలా చెప్పెను, “సమాప్తమాయెను” (యోహాను 19:30). క్రీస్తు మరణము, క్రీస్తు యొక్క అంతము కాదు; దానికి బదులు, అది ఆయన పనికి తుదిమెట్టు అయ్యున్నది. క్రీస్తు మరణము ప్రకృతికి అతీతమైన సంఘటనలను జరిగించినది, అవి ఆయన మరణము ప్రకృతికి అతీతమైన స్వభావమును ప్రతిబింబిస్తుంది (మత్తయి 27:45, 51-53). బైబిల్ చెప్పునది ఏమనగా, క్రీస్తు పాపులందరికి ప్రతిగా మరణించెను (1 పేతు. 3:18). క్రీస్తు యొక్క విమోచనా మరణము యొక్క నిత్యమైన ప్రభావము అనునది క్రీస్తే దేవుడు అనుదానికి ఒక రుజువు అయ్యున్నది (హెబ్రీ. 9:12, 14).

క్రీస్తు పునరుత్థానమే ఆయన దేవుడని నిరూపించుచున్నది

ఆయన సమాధిలో డెబ్బై రెండు గంటల కంటే తక్కువగా ఉన్నాడు. మూడవ దినమున ఆయన సమాధిలో నుండి లేచెను (మత్తయి 28:1-6). ఇది చారిత్రక వాస్తవము, దీన్ని ఏ చరిత్రకారుడు మార్చలేడు. ఆయన దేహముతో పునరుత్థానుడయ్యెను మరియు నలభై రోజులు తన శిష్యులకు అనేకమార్లు కనపడెను (1 కొరి. 15:4-7; అపొ. 1:3). ఆదిమ శిష్యులు కల్పించిన కథ లేక గాథ అని అనేకమంది ఆధునిక విమర్శకులు పునరుత్ధానమును కొట్టివేసిరి. అయితే వాస్తవమేమిటనగా, ఆయన పునరుత్థానము తరువాత క్రీస్తును అనేకమంది సాక్షులు చూసిరి, మరియు వాస్తవమేమిటనగా పునరుత్ధానుడైన క్రీస్తును వారు ఎదుర్కొనుట అనునది వారి జీవితములలో గొప్ప మార్పును తెచ్చినది అనునవి పునరుత్థానము అనునది కల్పించబడినది కాదనుటకు రుజువు అయ్యున్నవి. క్రీస్తు పునరుత్థానమునకు ముందు శిష్యులు భయముతోను, కలవరము-తోను ఉండిరి; పేతురు మూడుమార్లు ప్రభువును తృణీకరించెను (లూకా 22:54-62). ఆయన పునరుత్థానము తరువాత అదే గుంపు ప్రజలు ధైర్యవంతులును, దూకుడు గలవారు గాను అయ్యారు. పెంతెకోస్తు దినమున నిలబడి మూడువేలకు పైగా ఉన్న ప్రజలకు బోధించుటలో మొదటివాడు అయ్యెను (అపొ. 2:14). ఏ కల్పిత కథ జీవితమును మార్చే మార్పును తేలేదు; శిష్యులు కూడా ఏ విధమైన మతపరమైన భ్రమను కల్గియుండలేరు, ఎందుకనగా వారందరూ చక్కగా మాట్లాడారు మరియు భాద్యతగా ప్రవర్తించారు. ఆదిమ సంఘము స్వీయ మోసము చేసుకొన్న మతిభ్రమించిన సమాజము కాదు, గాని సరియైన, నీతిగల, మరియు స్వస్థ బుద్ధిగల విశ్వాసులు గలది. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము అనునది మానవ చరిత్రలో గొప్ప చారిత్రాత్మకమైన వాస్తవమైయున్నది.

దేవునిగా యేసునందు విశ్వాసముంచుట

ఒక వ్యక్తి ఆయన నామమును పిలచినప్పుడు మరియు ఆయనయందు విశ్వాసముంచినప్పుడు (రోమా. 10:9), క్రీస్తు జీవమిచ్చు ఆత్మగా అట్టివానిలోనికి ప్రవేశించును మరియు అతని జీవితమును మార్చును. నేడు ఆయనయందు విశ్వాసముంచుట వలన ఆయనను అనుభవించవచ్చును. నీ హృదయమును ఆయనకు తెరచినచో, నీ లోపల ఆయన రాజ్యమును స్థాపించుటకు ఆయన నీలోనికి వచ్చును. నీవు చీకటి రాజ్యములోనుండి వెలుగు రాజ్యము లోనికి తేబడుదువు (కొలొ. 1:13). క్రీస్తు నీ లోపల నీకు క్రొత్త జీవముగా ఉండును (కొలొ. 3:4), మరియు క్రీస్తునందు నీవు నూతన వ్యక్తివి అవుతావు (2 కొరి. 5:17). (Christ is God, pp. 1, 8, 10-11, 13, 15-21, 24-25)

References: Christ is God; CWWN, Vol. 27, The Normal Christian Faith, chs. 4-5; Five Great Mysteries in the Bible, ch. 3.

మహిమాన్విత రక్షకా

క్రీస్తును గూర్చిన అనుభవముజీవముగా

501

1   మహిమాన్విత రక్షకా,

నీవే దివ్య తేజుండవు;

నిత్య దేవుండవైనను

నరునిగా వచ్చితివే

 

క్రీస్తూ! దేవ స్వరూపుడా

తరగని నిధివీవే!

మానవాళితో దేవుని

మిళితము చేసితివి

 

2   దేవుని పూర్ణత నీలో

వసించెను మహిమతో;

శరీరిగా విమోచనన్

సాధించి ఆత్మవైతివి

 

3   తండ్రి ఐశ్వర్యం నీ సొంతం

ఆత్మగా నీవే మా సర్వం

ఆత్మగా నిజరూపివై

అనుభవేద్యమైతివి

 

4   జీవపుఆత్మ నీ వాక్యముచే

నాలోనికి ప్రసరించెన్

ఆత్మ ద్వారా వాక్యమును

తాకగా జీవమొందితిన్

 

5   ఆత్మలో నిన్ను చూడగా

అద్దంవోలె నీ మహిమన్

ప్రతిబింబించుచు నేను

నిన్నే వ్యక్తపర్చుదును

 

6   వేరే మార్గము లేదుగా

నీ మహిమలో పాలొందన్

పరిశుద్ద పర్చబడి

నీ మహిమన్ తాకుదును

 

7   నీ ఆత్మ నిన్ను నింపును

నాదు ప్రతి భాగమును

పరిశుద్ధలందరితో

నన్ను కలిపి కట్టును

Jump to section